సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది. గురువారం మంచి రోజు అనే నమ్మకంతో పలు పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, ఊరేగింపులతో వచ్చి అట్టహాసంగా నామినేషన్లు వేశారు. చాలామంది తొలుత తమ ఇష్ట దైవాలను పూజించుకొని, పండితుల వేద మంత్రాల ఆశీర్వాదాలు పొంది, తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసి నామినేషన్లకు బయలు దేరారు. దారి పొడవునా అభిమానులు కార్యకర్తల కేరింతలు, డాన్సులతో పరిసరాలు మార్మోగాయి. అభ్యర్థులకు మంగళహారతులు పడుతూ, శాలువాలు, గజమాలలతో సత్కరిస్తూ అడుగడుగునా అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ర్యాలీల కారణంగా ట్రాఫిక్ జాంలతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎమ్మెల్యేగా గెలుస్తా..
ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్రెడ్డి గురువారం కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన ఉప్పల్లోని రామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.
నగరమంతటా ఊరేగింపులతో సందడి
కార్యకర్తలు, అభిమానులతో బైక్ ర్యాలీలు
ఎటుచూసినా ఆటాపాటలతో అట్టహాసం
భారీ ట్రాఫిక్ జాంలతో జనాల అవస్థలు