వైఎస్ జగన్ అధ్యక్షతన విజయవాడలో భేటీ
పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరగనుంది. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈనెల 16న జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని మే 1, 2 తేదీల్లో వైఎస్ జగన్ గుంటూరులో రైతు దీక్ష చేసిన విషయం తెలిసిందే.
అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో పంటల ధరలు మరింత పతనమయ్యాయి. 16న జరిగే సమావేశాన్ని జీఎస్టీ బిల్లు ఆమోదానికే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రైతుల సమస్యలను అసెంబ్లీలో చర్చకు తీసుకు వచ్చి, మరిన్ని రోజులు సభ నిర్వహించే విధంగా పట్టుబట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.