కోవిడ్‌-19: టాయిలెట్‌ పేపర్‌ దొంగతనం

17 Feb, 2020 11:52 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

హాంకాంగ్‌:  ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) బారిన పడిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేవిధంగా రోజురోజుకు కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కాగా, కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా పలు కంపెనీలు బాధితుల కోసం మాస్క్‌లు, శానిటరీ నాప్‌కిన్ల ఉత్పత్తిని పెంచిన విషయం తెలిసిందే. చైనాలోని వూహాన్‌ నగరంలో ఉద్భవించిన కోవిడ్‌ వైరస్‌పై హాంకాంగ్‌ ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హాంకాంగ్‌లోని వెల్‌కమ్‌ స్టోర్‌ అనే సూపర్ మార్కెట్‌లో ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. (కోవిడ్‌ మృతులు 1,665)

వివరాలు.. ముగ్గురు దుండగులు సూపర్‌ మార్కెట్‌లోని 130 డాలర్ల విలువ గల 600 టాయిలెట్‌ పేపర్‌ రోల్స్‌ను దొంగిలించారు. దీంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టాయిట్‌ పేపర్‌ రోల్స్‌ దోపిడికి పాల్పడ్డ ముగ్గురిలో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. దుండగుల వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కోవిడ్‌ వైరస్‌ సంక్రమించకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే మాస్క్‌లు, నాప్‌కిన్ల కొరత రానుందనే అసత్యపు వార్తలు సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (‘కోవిడ్‌’ పేరిట రైతులకు బురిడీ)

మరిన్ని వార్తలు