బీజేపీకి పోస్టర్‌బాయ్‌గా మారా: మాల్యా 

1 Apr, 2019 02:28 IST|Sakshi

లండన్‌: బీజేపీ ప్రభుత్వం తనను పోస్టర్‌ బాయ్‌గా ఉపయోగించుకుంటోందని వివాదాస్పద లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా వ్యాఖ్యానించారు. భారత్‌లోని బ్యాంకులను తాను రూ.9 వేల కోట్ల మేర మోసం చేశానంటున్న ప్రభుత్వం.. రూ.14 వేల కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు చెబుతోంది. ప్రధాని మోదీ ప్రకటనే ఇందుకు రుజువంటూ ఆదివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘బీజేపీ ప్రభుత్వం నన్ను పోస్టర్‌ బాయ్‌గా వాడుకుంటోంది. నేను బ్యాంకులను మోసం చేసినట్లు చెబుతున్న మొత్తం కంటే స్వాధీనం చేసుకుంటామని చేసిన మొత్తం చాలా ఎక్కువ. ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు. ‘అయితే, 1992 నుంచే నేను బ్రిటన్‌ పౌరుడిగా ఉన్న విషయం మరిచి, దేశం విడిచి పారిపోయినట్లు నాపై ఆరోపణలు చేస్తోంది’ అని తెలిపారు. కాగా, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు మాల్యాను వెనక్కి పంపించాలంటూ గత నెల బ్రిటన్‌ హోం మంత్రి తీసుకున్న నిర్ణయంపై ఆయన అక్కడి హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ త్వరలోనే విచారణకు రానుందని సమాచారం. 

మరిన్ని వార్తలు