ఆధార్‌–పాన్‌ లింకేజ్‌ గడువు పెంపు 

1 Apr, 2019 02:20 IST|Sakshi

సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆధార్‌–పాన్‌ కార్డుల అనుసంధానం గడువును కేంద్రం ఆరోసారి పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోరు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘గతేడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకునేందుకు 2019, మార్చి 31ని గడువుగా నిర్ణయించింది. తాజాగా ఈ గడువును మరో ఆరు నెలలు అంటే సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగించింది. ఆధార్‌కు అనుసంధానం చేయని పాన్‌ కార్డులను రద్దుచేస్తారన్న వార్తల నేపథ్యంలో తాజాగా గడువును పెంచింది’ అని తెలిపారు.

ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయిస్తే తప్ప అందరూ ఆధార్‌–పాన్‌ అనుసంధానం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే వారు తప్పనిసరిగా ఆధార్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆధార్‌ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌ వరకూ 41 కోట్ల పాన్‌ కార్డులు జారీకాగా, వీటిలో 21 కోట్ల పాన్‌ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.    

మరిన్ని వార్తలు