భారత్‌లో పెరిగిన విదేశీ పర్యాటకం

3 Sep, 2018 13:38 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి  

ఐక్యరాజ్యసమితి: 2017లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం జోరందుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గతేడాది రికార్డు స్థాయిలో 132.3 కోట్ల మంది పర్యాటకులు వివిధ దేశాల్లో పర్యటించినట్లు పేర్కొంది. 2016తో పోలిస్తే.. ఈ సంఖ్య 8.4 కోట్లు అదనం. కాగా, దక్షిణాసియా ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించిన జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో పర్యాటకం సానుకూల వృద్ధితో ముందుకెళ్తోందని నివేదిక పేర్కొంది. సరళీకృతమైన వీసా విధానాల కారణంగా భారత్‌కు పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. 2017లో దక్షిణాసియాలో 2.6కోట్ల మంది విదేశీయులు పర్యటించగా అందులో 1.54 కోట్ల మంది భారత్‌కు వచ్చిన వారే. 2016లో భారత్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య 1.45కోట్లు కాగా.. వీరి ద్వారా దాదాపు రూ. 1.6లక్షల కోట్ల లాభం వచ్చింది.

అదే 2017లో 1.54కోట్ల మంది ద్వారా దాదాపు రూ. 1.94లక్షల కోట్ల లబ్ధి జరిగిందని నివేదిక తెలిపింది. అటు ప్రపంచవ్యాప్తంగానూ పర్యాటక రంగం జోరందుకుంది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. యూరప్‌లో 8%, ఆఫ్రికాలో 9% పెరుగుదల కనిపించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) లెక్కల ప్రకారం 2017లో పర్యాటకం ద్వారా ఆయా దేశాలకు రూ.1.3 ట్రిలియర్‌ డాలర్ల (రూ.92.3 లక్షల కోట్లు) లాభం జరిగిందన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదుశాతం పెరుగుదలని పేర్కొంది. కాగా టాప్‌–10 పర్యాటక కేంద్రాల్లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలున్నాయి.   

>
మరిన్ని వార్తలు