ప్రశాంత్‌ బాధ్యత పాకిస్తాన్‌దే: కేంద్ర విదేశాంగ శాఖ

21 Nov, 2019 16:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. ఈ నెల 14న హైదరాబాద్‌కు చెందిన వైందం ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌ను పాకిస్తాన్‌ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. పాస్‌పోర్టు, వీసా లేకుండా అక్రమంగా తమ దేశంలోకి అడుగు పెట్టారని ఆరోపిస్తూ వీరిని పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2016-17 సంవత్సరంలో ఇద్దరు భారతీయులు పాక్‌ చెరలో అడుగు పెట్టారనే సమాచారం అందిందని, అప్పుడే  ఈ విషయంపై పాకిస్తాన్ అధికారులకు సమాచారం అందించామన్నారు. అయితే అప్పటి నుంచి పాక్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదని.. అకస్మాత్తుగా అరెస్టు చేసిన ప్రకటన రావడం తమకు ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. ఈ అంశం గురించి పాక్‌ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్‌ చేస్తున్న అసత్య ప్రచారానికి వీరు బలికాబోరని.. వీరికి కాన్సులర్‌ యాక్సెస్‌ కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఇద్దరికీ ఎటువంటి హానీ కలగకుండా సురక్షితంగా స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. వీరిని తిరిగి రప్పించేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు వీరి బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు