పాక్‌ నిషేధిత జాబితాలో సయీద్‌ సంస్థలు

14 Feb, 2018 03:41 IST|Sakshi
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్‌ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల్లో సవరణలు చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని జమాత్‌–ఉద్‌–దవా, ఫలాహ్‌–ఐ–ఇన్సానియత్‌ ఫౌండేషన్‌తో పాటు పలు సంస్థల్ని ఉగ్రవాద జాబితాలో చేర్చుతూ పాక్‌ అధ్యక్షుడు ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర సంస్థలూ ఇందులో ఉన్నాయి.

ఉగ్రవాదానికి పాక్‌ అనుకూలమన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా పారిస్‌లో ఫిబ్రవరి 18 నుంచి జరగనున్న ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని ఎఫ్‌ఏటీఎఫ్‌ నియంత్రిస్తోంది. ఉగ్రవాదులకు అండగా ఉన్న పాక్‌ను ‘ఎఫ్‌ఏటీఎఫ్‌’ గ్రే జాబితాలో చేర్చేందుకు అమెరికా, భారత్‌ల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్‌ జారీచేశారు. గతంలో 2012 నుంచి మూడేళ్ల పాటు పాక్‌ ‘ఎఫ్‌ఏటీఎఫ్‌’ గ్రే జాబితాలో కొనసాగింది.   

మరిన్ని వార్తలు