‘కేంబ్రిడ్జి అనలిటికా’లు ఇంకెన్నో?

8 Apr, 2018 03:26 IST|Sakshi

డేటా లీకేజీపై ఫేస్‌బుక్‌ సీవోవో శాండ్‌బర్గ్‌

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా మాదిరిగా మరికొన్ని సంస్థలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని ఫేస్‌బుక్‌ సీవోవో (చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌) షెరిల్‌ శాండ్‌బర్గ్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పుడే నిర్ధారించలేమనీ, వివరాలను  పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఎన్నికల కోసం వాడుకోవడం తెల్సిందే. ఫేస్‌బుక్‌లో రాజకీయపరమైన ప్రకటనలు ఇచ్చేందుకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ప్రకటన ఇస్తున్న వారి చిరునామా సహా మిగిలిన గుర్తింపు వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రకటనలు తీసుకుంటామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

ఫేస్‌బుక్‌లో ‘అన్‌సెండ్‌’ ఫీచర్‌
ఫేస్‌బుక్‌లో ఎవరికైనా మెసేజ్‌ పంపితే దానిని డిలీట్‌ లేదా మార్పు చేసే వీల్లేదు. వాట్సాప్‌లో ఇలాంటి అవకాశముంది. ఇకపై ఇతరులకు పంపిన సందేశాలను డిలీట్‌ చేసేలా ‘అన్‌సెండ్‌’ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టబోతున్నట్లు సాంకేతిక వార్తల వెబ్‌సైట్‌ టెక్‌క్రంచ్‌ తెలిపింది. ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేంతవరకూ జుకర్‌బర్గ్‌ గతంలో కస్టమర్లకు పంపిన మెసేజ్‌లను సంస్థ డిలీట్‌ చేయదు.

మరిన్ని వార్తలు