బంగ్లాదేశ్ ను వణికిస్తున్న వరదలు...

13 May, 2016 08:12 IST|Sakshi
బంగ్లాదేశ్ ను వణికిస్తున్న వరదలు...

ఢాకా: బంగ్లాదేశ్ లో తలెత్తిన వరదల వల్ల దాదాపు 33 మందికి పైగా మృతిచెందారని అధికారులు తెలిపారు. గురువారం సంభవించిన ఈ వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. దీంతో బంగ్లా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించారు. వాయవ్య బంగ్లాదేశ్ లో ఈ వరదల ప్రభావం ఎక్కువగా కనిపించింది. పబ్నా, రాజ్ సాహి, సిర్జ్ గంజ్, బ్రాహ్మణ్ బారియా జిల్లాల్లో కనీసం 19 మంది చనిపోయి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు.

రాజధాని ఢాకాలో వర్షంలో ఫుట్ బాల్ ఆడుతున్న ముగ్గురు విద్యార్థులపై పిడుగు పడగా ఆస్పత్రికి తరలించామని స్టేషన్ ఆఫీసర్ కాసీర్ అహ్మద్ చెప్పారు. చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వరదల వల్ల సంభవించిన నష్టం కంటే పిడుగు పాటు వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని అహ్మద్ వివరించారు. ప్రతి ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాలకు ముందుగా బంగ్లాదేశ్ లో వరదలు సంభవిస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు