తుపాకీతో బెదిరించిన దొంగను ఉతికి ఆరేసింది!

5 Mar, 2016 09:54 IST|Sakshi
తుపాకీతో బెదిరించిన దొంగను ఉతికి ఆరేసింది!

ఓ దొంగోడు వచ్చి తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి బెదిరిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. దొంగ ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ భారతీయ మహిళ మాత్రం అలా భయపడలేదు. తుపాకీ చూపినా దొంగకు లొంగిపోలేదు. క్యాష్ బాక్స్ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన అతడిపై అపర కాళికలా విరుచుకుపడింది. తుపాకీని పక్కకుతోసేసి ఆ కుర్ర దొంగను చితకబాదింది. అంతటితో ఆగకుండా చేతికందిన సుత్తెతో రాణిరుద్రమ్మలా దాడికి ఉద్యుక్తం కావడంతో బెదిరిపోయిన ఆ దొంగ క్యాష్ బాక్స్ వదిలేసి పరుగులంకించుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కీస్‌విల్లెలో జరిగింది.

కీస్‌విల్లేలోని ఓ కిరాణ దుకాణంలో భూమిక పటేల్‌ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తుంది. 17 ఏళ్ల క్రిష్టియన్ డకోటా ఆమె దుకాణంలో దొంగతానికి ప్రయత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. కానీ వాడిని బెంబేలెత్తిస్తూ.. భూమిక పటేల్ అపర చండిక అవతారమెత్తింది. 'నన్ను కాలుస్తావా.. కాల్చేయ్‌' మంటూ ఎదురుదాడి చేసింది. తుపాకీని బేఖాతరు చేస్తూ చేతికందిన వస్తువుతో చితకబాదింది. అంతటితో ఆగకుండా ఓ సుత్తెతో ఆమె దాడికి ఉద్యుక్తం కావడంతో డకోటా తన దుండగాన్ని మానుకొని పరుగులు లంకించాడు.

అపర చండికలా వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్‌ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఐకాన్‌ అయ్యారు. ఆమె గురించి స్థానిక మీడియా గొప్పగా కథనాలు ప్రచురిస్తోంది. ఆమె దొంగను చితకబాదిన సీసీటీవీ కెమెరా వీడియోను స్థానికులు ప్రత్యేకంగా వచ్చి మరీ తిలకిస్తున్నారు. ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.