ఊహల్లో తేలిన రిపోర్టర్‌కు పిడుగు లాంటి వార్త

24 Dec, 2019 20:12 IST|Sakshi

అందరికీ వార్తలను చేరవేసే ఓ జర్నలిస్టు అత్యుత్సాహంతో తప్పులో కాలేసింది. కానీ దానివల్ల ఆమెకు మాత్రమే నష్టం జరిగింది. లాటరీ గెలుచుకున్నానంటూ లైవ్‌లోనే నానా హడావుడి చేసి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతింది. ఇంతకీ ఏం జరిగిందంటే... క్రిస్‌మస్‌ పండగ సందర్భంగా లాటరీ నిర్వాహకులు లక్కీడ్రా తీస్తున్నారు. ఈ కార్యక్రమాన్నంతటినీ స్పానిష్‌ టీవీ రిపోర్టర్‌ నటాలియా ఈక్యుడెరో లైవ్‌లో వివరిస్తూ వచ్చింది. అయితే లాటరీ గెల్చుకున్నవారిలో ఆమె పేరు కూడా ఉండటంతో ఎగిరి గంతేసింది.

తాను రేపటి నుంచి ఉద్యోగానికి రావడం లేదోచ్‌ అంటూ లైవ్‌లోనే రచ్చరచ్చ చేసింది. ఈ జాక్‌పాట్‌లో సుమారు నాలుగు మిలియన్ల డబ్బు అందుతుందనుకుని గాల్లో మేడలు కట్టేసింది. కానీ, తర్వాత అసలు విషయం తెలిశాక ఆమె ఆనందమంతా ఒ‍క్క క్షణంలో ఆవిరైపోయింది. కేవలం రూ.3 లక్షలు మాత్రమే గెల్చుకుందని తెలియడంతో ఆమె ఉత్సాహమంతా నీరుగారిపోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న రిపోర్టర్‌ ట్విటర్‌లో క్షమాపణలు తెలిపింది. ‘అతిగా ఆశ పడితే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు