సమయానికే సార్క్ సదస్సు నిర్వహిస్తాం

29 Sep, 2016 10:43 IST|Sakshi
సమయానికే సార్క్ సదస్సు నిర్వహిస్తాం

భారత్ సహా నాలుగు దేశాలు తాము హాజరయ్యేది లేదని స్పష్టంగా చెప్పినా.. ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ మాత్రం.. సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. నవంబర్ 9, 10 తేదీలలో ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు జరిగేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని అందులో తెలిపింది.

ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరయ్యేది లేదని భారతదేశం ముందుగా స్పష్టం చేసింది. ఆ తర్వాత వరుసపెట్టి బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా వివిధ కారణాలతో తాము ఇస్లామాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరు కాబోమని తెలిపాయి. దాంతో ఇక ఆతిథ్య దేశం పాకిస్థాన్‌తో పాటు కేవలం శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ మాత్రమే ఆ సదస్సులో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు ఏ ఒక్క సభ్య దేశం రాకపోయినా సదస్సు వాయిదా వేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని నేపాల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా నేపాల్ ఎందుకింతలా పట్టుబడుతోందన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

మరిన్ని వార్తలు