సగం కుళ్లిపోయినా ఆమె బతికే ఉంది

22 Mar, 2018 09:13 IST|Sakshi

వాషింగ్టన్‌ : దాదాపు పాడుబడిపోయి కంపుకొడుతున్న ఓ ఇంట్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఓ మహిళను అమెరికా అగ్నిమాపకశాఖ పోలీసులు గుర్తించారు. ఓ వ్యాధి కారణంగా బాగా లావెక్కి కదలలేకుండా మంచాన పడిపోయి ఉన్న ఆమెను చూసి దుఃఖితులయ్యారు. పైగా ఆమె కాళ్లకు పురుగులు పట్టి దాదాపు సగం వరకు కుళ్లిన స్థితిలోకి చేరడంతో ఆమె చనిపోయిందనే తొలుత భావించిన పోలీసులు ఆ తర్వాత ఆమె బతికి ఉండటాన్ని చూసి శర వేగంగా ఆస్పత్రికి తరలించారు. తమ జీవితంలో ఇలాంటి కేసు చూడలేదంటూ వర్ణించారు. వివరాల్లోకి వెళితే.. నార్తర్న్‌ జార్జియాలోని ఓ ఇంట్లో ట్రాసీ సారెల్స్‌ (50) అనే మహిళ చాలా రోజులుగా మంచంలో కదలేని స్థితిలో పడి ఉంది. ఆమెకు టెర్రి సారెల్స్‌ (54) అనే భర్తతోపాటు, క్రిస్టియాన్‌ (18) అనే కుమారుడు ఉన్నాడు.

ఆమె మంచానికి పరిమితం కావడంతో ఆమెను పూర్తిగా వారు నిర్లక్ష్యం చేశారు. ఎంతలా అంటే ఆమె పడి ఉన్న మంచంపై కనీసం బెడ్‌షీట్‌ లేదు. పైగా ఆ గది మొత్తం దుర్గందంతో నిండిపోయింది. ఆమె భర్త ఉపయోగించుకునే గది కంప్యూటర్‌ వద్ద తప్ప మరెక్కడా కూడా శుభ్రత అంటూ లేదు. ఓ చెత్త కర్మాగారంగా ఆ ఇల్లు మారిపోయింది. వంటగదిలో సీలింగ్‌ వరకు చెత్త పేరుకుపోయింది. ఆమె ముఖంపై ప్లాస్లిక్‌ పేపర్లు, తదితర ఇతర వస్తువులు వేసి ఉంచారు. ఏ ఒక్కరు కూడా కనీసం ఆమెను చూసేందుకు వెళ్లనట్లు కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది ఆ దృశ్యం చూసి షాక్‌ అయ్యారు. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించిన భర్తపై కేసులు నమోదు చేశారు. అయితే, ఆమె కుమారుడు స్పందిస్తూ తమ వద్ద అసలు డబ్బులు లేవని, ఏ ఒక్కరికీ ఉద్యోగం లేకపోవడంతోనే ఎలాంటి సపర్యలు చేయలేకపోయామంటూ వివరించాడు. కాగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులు ట్రాసీని గుర్తించారు.

మరిన్ని వార్తలు