ఆన్‌లైన్‌లో మద్యం.. రూ.83 వేలు మోసం!

13 Jun, 2020 16:39 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు దోచేశారు. దాదాపు 83వేల రూపాయలను స్వాహా చేశారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. చాందివ్లీ రహెజా విహార్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి (34) మే 18 న ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేయాలనుకున్నాడు. ఈక్రమంలో సమీపంలో ఉన్న మద్యం దుకాణాల కోసం వెతుకుతుండగా.. పేస్‌బుక్‌లో లభించిన ఓ వైన్స్‌కు సంబంధించిన నెంబర్‌కు కాల్‌ చేశాడు. రూ. 4,500 విలువ చేసే మద్యం కొనుగోలుకు ఆర్డర్‌ చేశాడు.

అయితే, అవతలి వ్యక్తి.. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాలని చెప్పి బాధితుని క్రెడిడ్‌ కార్డు వివరాలను అడిగి తెలుసుకున్నాడు. దాంతోపాటు.. బాధితుడు ఓటీపీ కూడా చెప్పాడు. కానీ, గంటలు గడుస్తున్నా మద్యం డోర్‌ డెలివరీ అవ్వలేదు. దాంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఉద్యోగి అకౌంట్‌లో డబ్బులు చెక్‌ చేసుకుని కంగుతిన్నాడు. అతని అకౌంట్‌ నుంచి రూ.82,500 చెల్లింపులు జరిగాయని తేలింది. మరింత సొమ్ము కోల్పోవాల్సి వస్తుందని భావించిన బాధితుడు.. వెంటనే బ్యాంకుకు కాల్‌ చేసి.. కార్డ్‌ బ్లాక్‌ చేయించాడు. అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టాలని చెప్పాడు.  అనంతరం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సైబర్‌ క్రైం డీసీపీ విశాల్‌ ఠాకూర్‌ చెప్పారు. తాజా ఘటనతో ముంబైలో.. ఆన్‌లైన్‌లో మద్యం‌ అమ్మకాలకు క్యాష్‌ ఆన్‌ డెలివరీ మాత్రమే అనుమతిస్తున్నారు.

మరిన్ని వార్తలు