శ్రీముఖి గెలుస్తుందనుకున్నా: బాబా

6 Nov, 2019 15:42 IST|Sakshi

బాబా భాస్కర్‌.. తెలిసిన కొద్దిమందికీ కోపిష్టి కొరియోగ్రాఫర్‌గా పరిచయం. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ కా కింగ్‌. ఆయన మాటలకు నవ్వుకోని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. బాబా.. ఏకంగా బిగ్‌బాస్‌ మనసునే గెలుచుకున్న వ్యక్తి. ఎలాంటి ఆర్మీలు, సోషల్‌ మీడియా అకౌంట్లు లేకపోయినా వేల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. రెండు వారాలు ఉండటానికి వచ్చాను అంటూనే టాప్‌ 3లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఓటమి చెందినందుకు తానేమీ బాధపడట్లేదు అంటున్నాడు. బిగ్‌బాస్‌ షో తన లైఫ్‌లో పెద్ద గిఫ్ట్‌ అని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. బిగ్‌బాస్‌ గురించి బాబా భాస్కర్‌ మాట్లాడుతూ.. రెండు వారాలే ఉంటాననుకున్నాను.. కానీ అందరూ నన్ను ఫినాలే వరకు తీసుకొచ్చారు. అందుకు ప్రేక్షకులు ప్రతీసారి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను.


సీన్‌ రివర్స్‌ అయింది.. 
బిగ్‌బాస్‌ షో కోసం 300 మంది పనిచేశారు. నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు.. నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు. అయితే నన్ను కొట్టినా పర్లేదు కానీ  నా వెనక మాట్లాడటం నచ్చదు.. అది తట్టుకోలేను. ఇక నాగార్జున నవ్వుతూనే అన్ని చెప్పేవారు. గొడవలైనా కూడా అందరినీ కలిపేవారు. శనివారం వచ్చిందంటే ఏమంటారోనని భయపడుతూ ఉండేవాళ్లం. మెడాలియన్‌ టాస్క్‌లో వితిక తెలివిగా ఆడింది.. కానీ నమ్మకద్రోహం చేసిందనిపించింది. నేను మెడాలియన్‌ కోసం బాగా ప్రయత్నించాను కానీ అది దొరకలేదు.


కొరియోగ్రఫీ చేయమని అడిగారు
రాహుల్‌, శ్రీముఖి, వరుణ్‌ ఈ ముగ్గురిలో ఒకరు గెలుస్తారనుకున్నాను. మరీ ముఖ్యంగా శ్రీముఖి గెలుస్తుందనుకున్నా. అయితే రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించారంటే అతనికి వచ్చిన ఓట్లే కారణం.  నా గురించి మెగాస్టార్‌ స్టేజీమీద మాట్లాడారు. నేను ఆయనకు ఫ్యాన్‌ అని చెప్తే ఆయనే తిరిగి నాకు ఫ్యాన్‌ అనడం చాలా సంతోషంగా అనిపించింది. షోలో మరొకటి కూడా చెప్పారు. కానీ అది టెలికాస్ట్‌ చేయలేదు. మెగాస్టార్‌ ఏమన్నారంటే.. ‘మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఖైదీ 150 కూడా చేశాను. నాకు కొరియోగ్రఫీ చేస్తావా’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని బాబా భాస్కర్‌ బదులిచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌తో క్లోజ్‌గా ఉన్నాడని ఫ్యామిలీలో గొడవలు వచ్చాయంటూ వచ్చిన పుకార్లను బాబా కొట్టిపారేశాడు. ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు