ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న బిగ్‌బాస్‌!

15 Oct, 2019 17:17 IST|Sakshi

హౌస్‌లో గొడవలు రాజుకున్నాయనుకునేలోపే ఏదైనా ఫన్నీ టాస్క్‌ ఇచ్చి ఇంటి సభ్యులను కూల్‌ చేస్తాడు బిగ్‌బాస్‌. అందరూ కుటుంబంలాగా కలిసిపోయారనుకునేలోపే మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేస్తాడు. ఇవాళ కూడా ఇదే ఫార్ములా వాడనున్నాడు. నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్‌ హౌజ్‌ హీటెక్కగా ఫన్నీ టాస్క్‌తో నవ్వులు పూయించనున్నాడు. తాజా ప్రోమోలో ఇంటి సభ్యులందరూ ఒకే రకమైన వస్త్రాలను ధరించి, వారి చేష్టలతో నవ్వు తెప్పిస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ ఇంట్లో ఎనభై అయిదు రోజులు పూర్తయ్యాయి. షో ముగియడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇప్పటివరకు ఇంటి సభ్యులు బయటి ప్రపంచానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వారిని బంధువులతో ఫోన్‌లో మాట్లాడించడం కానీ, కలవనీయడం కానీ జరగలేదు.

గతంలో అరవై రోజుల పండగలో వితిక, రవి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని తనివితీరా కబుర్లు చెప్పుకున్నప్పటికీ మిగతావారికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఒక్కసారి కలుసుకునే చాన్స్‌ ఇవ్వండని కన్నీళ్లతో వేడుకున్నప్పటికీ అందుకు బిగ్‌బాస్‌ ససేమీరా ఒప్పుకోలేదు. కాగా నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. షో ముగింపుకు వస్తున్నందున ఇంటి సభ్యులకు బూస్ట్‌ ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపిచనున్నట్టు తెలుస్తోంది. అలీ భార్య మసూమా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే ఎమోషనల్‌గా మారింది. మరి ఇంటి సభ్యులందరి ఫ్యామిలీస్‌ను కూడా బిగ్‌బాస్‌ పంపిస్తున్నాడా లేదా అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. అటు కామెడీ, ఇటు ఎమోషన్స్‌తో నేటి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారనుంది.

మరిన్ని వార్తలు