రాహుల్‌కు అభినందనలు చెప్పని శ్రీముఖి

5 Nov, 2019 10:25 IST|Sakshi

బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఆదివారం ఎపిసోడ్‌తో అట్టహాసంగా ముగిసింది. అనూహ్యంగా చివరి సమయంలో పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ను దక్కించుకోగా శ్రీముఖి రెండో స్థానంలో నిలిచింది. ఇక రాహుల్‌ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్‌ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమితమవడం జీర్ణించుకోలేకపోతోంది. ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టింది. హోస్ట్‌ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వెల్లగక్కింది. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్య అతిథి చిరంజీవి కూడా శ్రీముఖిని అనుసరిస్తూ.. ‘రాహుల్‌ చెక్‌ మాత్రమే తీసుకున్నాడు. కానీ నువ్వు కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నావు’ అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఇక ప్రజల తీర్పును శ్రీముఖి గౌరవించినట్టులేదు. ‘విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది’ అని ఆమె బిగ్‌బాస్‌ వేదికపై చెప్పుకొచ్చింది. అంటే రాహుల్ ఏం చేయకపోయినా కేవలం అదృష్టం వల్లే గెలిచాడు అన్నట్టుగా ఆమె మాటలు ధ్వనించాయి. మొదటి నుంచి టైటిల్‌ తనదే అని ఫిక్స్‌ అయిన శ్రీముఖికి రాహుల్‌ విజయం గట్టి షాక్‌నిచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా విజేతగా నిలిచిన రాహుల్‌కు కనీసం అభినందనలు చెప్పకపోవడంపై నెటిజన్లు శ్రీముఖిని విమర్శిస్తున్నారు. ఆచితూచి మాట్లాడే శ్రీముఖి అంతపెద్ద స్టేజిపై సరిగా ప్రవర్తించలేదని అంటున్నారు. ఓటమిని అంగీకరించాలి తప్పితే గెలుపును తప్పుబట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె తీరును విమర్శిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు