బిగ్‌బాస్‌.. వితికను కిందపడేశారు..?

1 Oct, 2019 12:12 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇచ్చిన రాళ్లే రత్నాలు టాస్క్‌లో మహేశ్‌.. రాహుల్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే! అయితే అదంతా ఆటలో భాగమే అని మిగతావారు నచ్చజెప్పడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకులే అని భావించిన మహేశ్‌ తిరిగి ఆట ప్రారంభించాడు. ఇక అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవేశంలో పునర్నవికి ఇచ్చిన 200 విలువ చేసే రాయి ఇవ్వనని మొండికేసింది. అయితే వెంటనే తేరుకున్న మహేశ్‌ మళ్లీ ఆటలో కాస్త పుంజుకున్నాడు. ఇక బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు నామినేషన్‌ టాస్క్‌ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్‌ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్‌ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. టాస్క్‌లో సేకరించే రాళ్లతో వంట సామాగ్రిని కొనుక్కొని భోజనం సిద్ధం చేసుకోవాలి. ఇక వంటసామాగ్రి ఖరీదు చూసి ఇంటిసభ్యులు గుడ్లు తేలేశారు. రూపాయి అగ్గిపెట్టె కూడా రూ.500 ఉంది. దీంతో ఇంటిసభ్యులు తిండి కోసం నానా తంటాలు పడ్డారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మహేశ్‌, రాహుల్‌కు గొడవ జరగగా నేడు వరుణ్‌, వితికలకు భేదాభిప్రాయాలు వచ్చినట్టు కనిపిస్తోంది. రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తోపులాటలో వితిక కిందపడింది. దీంతో చూస్కొని ఆడొచ్చు కదా అంటూ వితిక అసహనంతో ఊగిపోయింది. ‘ఇది టాస్క్‌.. అలానే జరుగుతుంది, టాస్క్‌లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్‌.. వితికపై ఫైర్‌ అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. ఆడితే ఆడు, లేకపోతే లేదంటూ వితికపై మండిపడ్డాడు. వితికపై ఈగ కూడా వాలనివ్వని వరుణ్‌.. ఎందుకు తనపై అంతలా సీరియస్‌ అయ్యాడు? అసలు వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుంది అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. ​కాగా ఇప్పటికే రాహుల్‌ నామినేట్‌ అవగా, నేటి ఎపిసోడ్‌లో ఎవరు నామినేషన్‌ జోన్‌లోకి రానున్నారో చూడాలి!

మరిన్ని వార్తలు