చైతూతో ఎన్టీఆర్ డైరెక్టర్‌..?

21 Feb, 2018 13:50 IST|Sakshi
నాగచైతన్య

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు బాబీ.. తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించిన బాబీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ‘నిన్ను కోరి’ ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్‌ అన్ని పూర్తయితేగాని బాబీ సినిమా సెట్స్‌ మీదకు వచ్చే అవకాశం లేదు. మరి బాబీ అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేక ఈ లోపు మరో సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు