నందమూరి నాలుగో తరం ఇది!

8 May, 2015 00:44 IST|Sakshi
నందమూరి నాలుగో తరం ఇది!

‘‘మా కుటుంబంలోని  నాలుగో తరం వారు కూడా బాలనటులుగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అరుదైన అవకాశం అందించిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు’’ అని ఎన్టీఆర్ అన్నారు. నందమూరి హరికృష్ణ మనుమలు, దివంగత జానకీరామ్ తనయులు మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రలను  వెండితెరకు పరిచయం  చేస్తూ సీహెచ్ వెంకటేశ్వరరావు, జె. బాలరాజు నిర్మిస్తున్న బాలల చిత్రం ‘దానవీరశూరకర్ణ’. జె.వి.ఆర్ దర్శకుడు.
 
 గాయని కౌసల్య స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని హీరో కల్యాణ్‌రామ్ ఆవిష్కరించి,  ఎన్టీఆర్‌కు అందించారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘మమ్మల్ని ప్రోత్సహించినట్టుగానే మా వంశం నుంచి వస్తున్న నాలుగో తరం వారిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. చాలా మంచి సబ్జెక్ట్ ఇది’’ అని సీనియర్ నిర్మాత  కేఎస్ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, నిర్మాత సి.కల్యాణ్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.