కోలీవుడ్‌కు మరో మోడల్‌

16 Sep, 2018 08:35 IST|Sakshi

దర్శకుడు మణిరత్నం హస్తవాసి బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్లకు మణి లక్కీ హ్యాండ్‌. రోజా చిత్రంతో మధుబాలను, ముంబయి చిత్రంతో మనీషా కోయిరాలను, ఇరువర్‌ చిత్రంతో ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేసి వారి సినీ జీవితాన్ని ఇచ్చారు. ఇటీవల కాట్రువెలియిడై చిత్రం ద్వారా అధితిరావ్‌ హైదరిని  కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అధితిరావ్‌ హైదరికి మాత్రం ఇక్కడ అవకాశాలు వరుస కడుతున్నాయి.

అదే వరుసలో తాజాగా మణిరత్నం మరో ప్రముఖ మోడల్‌ను హీరోయిన్‌గా పరిచయం చేశారు. అమెనే డయానా ఎరప్పా. మణిరత్నం తాజా చిత్రం సెక్క సివంద వారం చిత్రంలోని హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరుగా కనిపించనుంది. సంచలన నటుడు శింబుతో ఈ అమ్మడు ఇందులో రొమాన్స్‌ చేసింది. కర్ణాటకకు చెందిన డయానా ఎరప్పా 2011లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో తొలి 10 మందిలో ఒకరుగా నిలిచింది.

ఆ తరువాత 2012లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్‌ పోటీ అయిన షాంగాయ్‌ ఎలైట్‌ మోడల్‌ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. అదే విధంగా 2015, 2017 కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్, లాక్మే ష్యాషన్‌ వీక్, అమేజాన్‌ ష్యాషన్‌ వీక్‌ వంటి పలు ప్రాచుర్యం పొందిన పత్రికల ముఖ చిత్రాలపై మెరిసిన సుందరి డయానా ఎరప్పా. అదే విధంగా పలు ప్రముఖ వ్యాపార సంస్థల ప్రచార ప్రకటనల్లో నటించిన ఈ మోడల్‌ దర్శకుడు మణిరత్నం కంట పడింది.

అంతే వెండి తెరకెక్కేసింది. మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని ఈ అమ్మడు చిత్ర ఆడియో విడుదల వేదికపై చెప్పింది. అదేవిధంగా శింబుకు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఇంత మంచి అవకాశం కల్సించిన దర్శకుడు మణిరత్నంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది.  సెక్క సివంద వానం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తన సినీ భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఈ చిత్రం విడుదల కోసం ఈ సుందరి చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తోందట.

మరిన్ని వార్తలు