దాసరి లేని లోటు తెలుస్తోంది

31 May, 2020 03:20 IST|Sakshi

‘‘కరోనా వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్ని దాసరిగారైతే మరోలా కాపాడేవారు. దాసరిగారిని తలుచుకోని రోజు లేదు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. శనివారం దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్థంతి. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌లో పలువురు సినీ ప్రముఖులు దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు లేని లోటు కనిపిస్తోంది. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘మేం దాసరిగారి దగ్గర పని చేయలేదు.

అయినా ఆయన మనుషులం అని గర్వంగా చెప్పుకుంటాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘ప్రతి ఒక్కరికీ విలువ ఇచ్చి మాట్లాడేవారు దాసరిగారు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చేయలేరు’’ అన్నారు నిర్మాత ప్రసన్న కుమార్‌. ‘‘నేను బతికి ఉన్నంత కాలం దాసరిగారి జయంతి, వర్థంతి జరిగేలా చూస్తాం. ప్రతి ఏడాదీ దాసరి అవార్డ్స్‌ కొనసాగిస్తాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. శ్రీకాంత్, రేలంగి నరసింహా రావు, రాజా వన్నెం రెడ్డి, తాండవ, పీడీవీ ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి ఫుడ్‌ ప్యాకెట్లు, స్వీట్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు రామసత్యనారాయణ.
 

మరిన్ని వార్తలు