లిస్టులో తొలిసారి చోటు దక్కించుకున్న ప్రభాస్‌

19 Dec, 2019 15:48 IST|Sakshi

ఫోర్బ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో టాప్‌-100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వారికున్న క్రేజ్‌ను బట్టి స్థానాలను కేటాయించినట్లు పేర్కొంది. ఈ లిస్టులో బాలీవుడ్‌ స్టార్లను వెనక్కునెట్టి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారిగా బాలీవుడ్‌ హీరోయిన్లు అలియా భట్‌, దీపిక పదుకునే టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ఖాన్‌ను వెనక్కునెట్టి కిలాడీ అక్షయ్‌ కుమార్‌(రూ.293.25 కోట్లు) రెండో స్థానం సంపాదించుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అగ్ర స్థానంలోనే కొనసాగుతూ వచ్చిన సల్మాన్‌ఖాన్‌(రూ.229.25కోట్లు) ఈ యేడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బాలీవుడ్‌ బ్యూటీలు అలియా భట్‌, దీపిక పదుకునే 8, 10 స్థానాల్లో పాగా వేశారు. ‘కౌన్‌ బరేగా కరోడ్‌పతి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ రూ.239.25 కోట్లతో నాలుగో తర్వాతి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్‌ హీరోలు షారుఖ్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. గతేడాది ఈ జాబితాలో పేరు కానరాని డార్లింగ్‌ ప్రభాస్‌(రూ.35 కోట్లు) ఈ సారి ఏకంగా 44వ స్థానంలో ఉన్నాడు. నిరుడు 33వ స్థానంలో ఉన్న టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు(రూ.35 కోట్లు) 54వ స్థానానికి పరిమితమయ్యారు. తొలిసారిగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌(రూ.21.5 కోట్లు) 77వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఈ యేడు సెలబ్రిటీల ఆదాయం 22 శాతం పెరిగినట్టుగా ఫోర్బ్స్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు