అజిత్‌ అభిమానులకు శుభవార్త..

21 Apr, 2017 10:09 IST|Sakshi
అజిత్‌ అభిమానులకు శుభవార్త..

వద్దన్నా వెంటనడిచే అభిమానులన్న ఏకైక నటుడు అజిత్‌ అని చెప్పవచ్చు. ఆయన అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితమే తన అభిమాన సంఘాలను రద్దు చేశారు. అయితే వద్దంటే పోయేదా ఆయనపై అభిమానం. అజిత్‌ అధికారికంగా రద్దు చేసినా అనధికారంగా అజిత్‌ అభిమాన సంఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. అజిత్‌ పుట్టిన రోజు, ఆయన చిత్రాల విడుదల సమయాల్లో అభిమానులు తన వీరాభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తూనే ఉన్నారు.

అజిత్‌ నూతన చిత్రం కోసం ఆతృతంగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలా అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం వివేగం కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అభిమానులకు శుభవార్త ఏమిటంటే వివేగం చిత్రం గురించి ఇప్పటి వరకూ వెలువడని కొన్ని విశేషాలు ఇక్కడ పొందుపరుస్తున్నాం. అజిత్‌ దర్శకుడు శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడవ చిత్రం వివేగం.

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో అందాల బామ కాజల్‌అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రం అధిక భాగం బల్గేరియాలో చిత్రీకరణ జరుపుకుంది. కొన్ని కీలక సన్నివేశాలను యూరప్‌ దేశాల్లో ఈ చిత్రం 70 శాతం షూటింగ్‌ జరుపుకుంది. మిగిలిన షూటింగ్‌ను ఇండియాలో చిత్రీకరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే వివేగం చిత్రం గత ఏడారి ఆగస్ట్‌ 2న ప్రారంభమైంది. మే నెల 10వ తేదీకీ చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. అంటే మొత్తం 282 రోజుల్లో 150 రోజులు షూటింగ్‌ను జరుపుకుంది. ఇందులో అజిత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌గా నటిస్తున్నారు.

ఆయన అంతర్జాతీయ టెర్రర్‌ నెట్‌వర్క్‌ను ఎలా అంతం చేశారన్నదే వివేగం చిత్ర కథ అని తెలిసింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబరాయ్‌ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అజిత్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ ఏమిటంటే ఆయన పుట్టిన రోజు మే ఒకటవ తేదీన వివేగం టీజర్‌ను విడుదల కానుందన్నది తాజా సమాచారం. అదే విధంగా చిత్రాన్ని ఆగస్ట్‌ 10న గానీ 24గానీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.