వేడి తగ్గలేదు

15 Jul, 2018 00:37 IST|Sakshi
చిరంజీవి

రుతువు మారి వర్షాకాలం వచ్చిన తర్వాత వెదర్‌ చల్లగా మారింది. కానీ ‘సైరా’ సెట్‌లో మాత్రం వార్‌ వేడి ఇంకా చల్లారలేదు. పైగా వేడి ఇంకా పెరుగుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో జరుగుతోంది.

ఇప్పటివరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందట. గత 30 రోజుల నుంచి వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్‌ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి, సుదీప్‌లపై ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ వార్‌ బ్యాక్‌డ్రాప్‌ షెడ్యూల్‌ ఈ నెల 25 వరకు కొనసాగనుందని సమాచారం. ‘సైరా’ చిత్రానికి హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ గ్యారీ పావెల్‌ వర్క్‌ చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, విజయ్‌ సేతుపతి తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు రత్నవేలు ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు