ఆవేశం ఆయుధమైతే...

23 Mar, 2020 03:37 IST|Sakshi

‘గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే.. ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం’ అంటూ భావోద్వేగం నిండిన వాయిస్‌ ఓవర్‌తో విడుదలైన ‘మహాప్రస్థానం’ మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. తనీష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహాప్రస్థానం’. ‘ద జర్నీ ఆఫ్‌ ఆన్‌ ఎమోషనల్‌ కిల్లర్‌’ అనేది ఉపశీర్షిక. జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్‌ సేథీ కథానాయిక. ‘వరుడు’ ఫేమ్‌ భానుశ్రీ మెహ్రా, కబీర్‌ దుహాన్‌ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవికి విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్‌ జాని మాట్లాడుతూ– ‘‘తనీష్‌ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్‌గా తన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ చేయించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: ఎంఎన్‌ బాల్‌ రెడ్డి.

>
మరిన్ని వార్తలు