ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో..

4 Dec, 2017 07:55 IST|Sakshi

తమిళసినిమా: స్పైడర్‌తో కోలీవుడ్‌లో హంగామా చేసిన టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మరోసారి అనిరుధ్‌టూ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.స్పైడర్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌తోనే రొమాన్స్‌ చేసిన ఈయన ఈ సారి ఏకంగా కాజల్‌అగర్వాల్, సమంత, ప్రణీత అంటూ ముగ్గురితో ఫుల్‌కలర్‌ఫుల్‌గా అలరించడానికి వస్తున్నారు. అవును టాలీవుడ్‌లో మహేశ్‌ హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రం ఇప్పుడు అనిరుధ్‌ పేరుతో కోలీవుడ్‌కు రానుంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్, రేవతి, జయసుధ, షియాజీ షిండే, ముఖేష్‌ రిషీ అంటూ ప్రముఖ నటీనటులే నటించారు. కోలీవుడ్‌లో మహేశ్‌బాబు చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. 

ఇంతకు ముందు భారీ చిత్రాలు సెల్వందన్, ప్రభాష్‌ బాహుబలి, మగధీర, బ్రూస్‌లీ, ఎవండా వంటి చిత్రాలను కోలీవుడ్‌ ప్రేక్షకులకు అందించిన స్వాతి, వర్షిణిల భద్రకాళీ ఫిలింస్‌ అధినేత భద్రకాళీ ప్రసాద్‌ తమిళంలో అనువదిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా సత్యాసీతల ,అడ్డాల వెంకట్రావు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రత్నవేల్‌ ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి అనువాత రచయిత బాధ్యతలను ఏఆర్‌కు.రాజరాజన్‌ నిర్వహిస్తున్నారు.ఈ చిత్ర విలేకరుల సమావేశాన్ని శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మహేశ్‌బాబు నటించిన అత్యంత భారీ చిత్రాల్లో బ్రహ్మోత్సవం ఒకటని తెలిపారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. 

ప్రపంచంలోని ప్రాణులన్నిటికీ ప్రేమానుబంధాలతోనే మనుగడ ముడిపడి ఉంటుంది. అలాంటి కుటుంబ అనుబంధాల ప్రాధాన్యతను చెప్పే చిత్రంగా అనిరుధ్‌ ఉంటుందన్నారు. అంతా కలిసి ఉన్నప్పుడు ప్రేమానుబంధాల విలువ తెలియదన్నారు.ఒక్క సారి  దూరం అయితే దాని విలువేమిటో అవగతం అవుతుందన్నారు.అలా తండ్రి ఆశయం కోసం తన ఏడుతరాల బంధువులను అన్వేషిస్తూ హీరో సాగించిన పయనమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని తెలిపారు.చిత్రంలో ఫ్రేమ్‌ నిండా తారలు కనిపిస్తూ కలర్‌ఫుల్‌గా అనిరుధ్‌ చిత్రం ఉంటుందన్నారు. కాజల్‌అగర్వాల్, సమంత, ప్రణీతలతో మహేశ్‌బాబు రొమాన్స్‌ రమణీయంగా, కనువిందుగా ఉంటూ యువతను ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు