మనీషాకు మరో అవకాశం

1 Jul, 2014 00:42 IST|Sakshi
మనీషాకు మరో అవకాశం

వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి మనీషా యాదవ్. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వరించాయి. జన్నల్ ఓరం, ఆదరాల్ కాదల్ సెయ్‌వీర్ వంటి విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మనీషా, దర్శకుడు శ్రీనురామస్వామి చిత్రం ఇవళ్ ఇదం పొరుళ్ చిత్రంలో ఎంపికయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె నటన సంతృప్తి కలిగించలేదంటూ దర్శకుడు చిత్రం నుంచి తొలగించారు.
 
 కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన మనీషా కెరీర్‌కు కొంచెం నష్టం కలిగించిందనే చెప్పాలి. ఆ తర్వాత అవకాశాలు కూడా ఆమెకు దూరం అయ్యాయి. తాజాగా మనీషాకు మరో అవకాశం వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత దినేష్ హీరోగా అవతారమెత్తనున్నారు. ఆయనతో మనీషా రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ జంట నటించే చిత్రానికి ‘ఒరు కుప్పై కథై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 
 కాళి రంగస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మరో యువ దర్శకుడు అస్లామ్ నిర్మించనుండడం విశేషం. మరో ముఖ్య అంశం ఏమిటంటే కాదల్ చిత్రం ఫేమ్ జాష్వా శ్రీధర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడం. ఈయన కొంత కాలంగా తమిళ చిత్రాలకు పని చేయడం లేదు.  ఒరు కుప్పై కైథైవైవిద్య భరిత కుటుంబ కథ చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి తెలిపారు. దినేష్ చిత్రంలో చెన్నైకు చెందిన ఒక నిస్సహాయకుడైన యువకుడిగా నటిస్తున్నారని, మనీషా పల్లెటూరి పడుచుగా నటిస్తున్నారని చెప్పారు.