ధనుష్‌కి సారీ చెప్పాలి!

23 Jun, 2016 00:32 IST|Sakshi
ధనుష్‌కి సారీ చెప్పాలి!

ఎవరైనా ఇంకొకరికి ‘సారీ’ చెప్పారంటే... కచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటారు. మరి.. నయనతార ఏం తప్పు చేశారో ఏమో? హీరో ధనుష్‌కి సారీ చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయంలోకి వస్తే... ఇటీవల జరిగిన సౌతిండియా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్లో తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’లోని నటనకుగాను నయనతారను ఉత్తమ కథానాయిక పురస్కారం వరించింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘కాక్కా ముట్టై’ ఎంపికైంది. ఈ రెండు చిత్రాలను నిర్మించింది ధనుషే.
 
  ‘కాక్కా ముట్టై’ పురస్కారం అందుకున్న తర్వాత, ఆ చిత్రంలో కథానాయిక ఐశ్వర్యా రాజేష్ డీ-గ్లామరస్ పాత్రలో బాగా నటించిందని ధనుష్ ప్రశంసించారు. చాలాసేపు మాట్లాడిన ధనుష్..  నయనతార గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ‘నానుమ్ రౌడీదాన్’లో నయనతార చెవిటి యువతిగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
 
 కానీ, ధనుష్ ఏం చెప్పకపోవడంతో నొచ్చుకున్నట్లున్నారు. ‘‘నేను ధనుష్‌కి సారీ చెప్పాలి. ‘నానుమ్ రౌడీదాన్’లో తనకు నా నటన నచ్చలేదనుకుంటా. అందుకే నా గురించి మాట్లాడలేదేమో! తర్వాతి చిత్రంలో బాగా నటించి అతణ్ణి మెప్పిస్తాను’’ అని నయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని, నయన తెలివిగా ధనుష్‌ని విమర్శించిందని విశ్లేషకులు అంటున్నారు.