పొలిటికల్‌ సెటైర్‌గా..!

23 Apr, 2019 10:47 IST|Sakshi

సమకాలీన రాజకీయాలపై దండయాత్ర చేసే చిత్రంగా ఒబామా ఉంగళుక్కాగ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఇంతకు ముందు అదు వేర ఇదు వేర చిత్రాన్ని నిర్మించిన జీపీజీ ఫిలింస్‌ అధినేత ఎస్‌.జయశీలన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఒబామా ఉంగళుక్కాగ. నానీబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు బాలకృష్ణన్‌ పేరుతో పాస్‌మార్క్‌ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం.

ఒబామా ఉంగళుక్కాగ చిత్రంలో పృధ్వీ కథానాయకుడిగా నటిస్తున్నారు. నవ నటి పూర్ణిషా నాయకిగా పరిచయం అవుతోంది. సీనియర్‌ నటుడు జనకరాజ్‌ ఇంత వరకూ పోషించనటువంటి విభిన్న పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకులు విక్రమన్, కేఎస్‌.రవికుమార్, రమేశ్‌ఖన్నాలు దర్శకులుగానే నటించడం విశేషం. అదే విధంగా నిర్మాత టీ.శివ, నిత్య, రామ్‌రాజ్, దళపతి దినేశ్, సెంబులి జగన్, కయల్‌దేవరాజ్, విజయ్‌ టీవీ ఫేమ్‌ కోదండం, శరత్‌ తదితరలు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది రాజకీయాలపై దండయాత్ర చేసే కథా చిత్రంగా ఉంటుందన్నారు. కథను ఎంతో శోధించి, పలువురు సలహాలను తీసుకుని తెరెక్కించిన చిత్రం ఒబామా ఉంగళుక్కాగ అని తెలిపారు. థామస్‌ అల్వా ఎడిసన్‌ టెలిఫోన్‌ను కనిపెట్టింది మాట్లాడుకోవడానికేనని, అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో చూడలేనిదీ, సాధించలేనిదీ ఏదీ లేదన్నట్టుగా మారిపోయిందన్నారు.

ఈ చిత్రంలో అలాంటి సెల్‌ఫోన్‌ కూడా ఒక హీరో పాత్రగా ఉంటుందని చెప్పారు. రాజకీయాలను నార తీసి పిండే చిత్రంగా ఒబామా ఉంగళుక్కాగ చిత్రం ఉంటుందని చెప్పారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించడంతో పాటు ఒక పాటలో డాన్స్‌ చేసి దుమ్మురేపారన్నారు. చిత్రానికి దినేశ్‌ శ్రీనివాస్‌ ఛాయాగ్రహణంను అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు