గౌరవాన్ని పెంచే చిత్రాలు అరుదే

3 Apr, 2016 01:52 IST|Sakshi
గౌరవాన్ని పెంచే చిత్రాలు అరుదే

గౌరవాన్ని పెంచే చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున పేర్కొన్నారు. తోళా సినిమాకు మరోసారి ఊపిరి నిచ్చిన చిత్రం ఇది. దీనికి శ్వాసగా నిలిచింది నటుడు నాగార్జున, కార్తీ, దర్శకుడు వంశీ పైడిపల్లి. నటి తమన్నా అందం పక్కా బలంగా నిలిచింది పీవీపీ సినిమా.జయసుధ,ప్రకాశ్‌రాజ్‌ల అభినయం అదనపు మెరుగులు దిద్దింది. గోపీ సుందర్ సంగీతం ఆహ్లాదాన్ని పెంచింది. మైమరపించిన పీఎస్.వినోద్ చాయాగ్రహణం, వినోదంతో పాటు చక్కని సందేశంతో కూడిన కథ వెరసి చాలా కాలం తరువాత కుటుంబ సమేతంగా చూసి ఆనందించే ఒక మంచి చిత్రంగా తెరపై ఆవిషృతమైన చిత్రం తోళా. తెలుగులో ఊపిరిగా రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సకల ప్రేక్షకాదరణతో విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఉదయం చెన్నైలో ధన్యవాద సమావేశాన్ని నిర్వహించింది.
 
 పునరుత్తేజాన్నిచ్చింది
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుల్లో ఒకరైన నాగార్జున మాట్లాడుతూ సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు చాలా వస్తుంటాయి.అయితే బాక్సాఫీస్ వద్ద గౌరవాన్ని పెంచే చిత్రాలు మాత్రం అరుదుగానే ఉంటాయని అన్నారు.అలాంటి చిత్రాలను తనలాంటి యాక్టర్లు, ఫిలిం మేకర్లు కావాలని ఆశిస్తుంటారన్నారు. అలా తనలోని కాన్ఫిడెంట్‌ను మరింత పెంచిన చిత్రం తోళా అని పేర్కొన్నారు. ఇలాంటి మంచి చిత్రాలను మరిన్ని చేయాలనే ఆకాంక్షను పెంచిన చిత్రం ఇదని అన్నారు.

 గుడ్ చిత్రాలంటే ఆర్ట్ ఫిలింస్ అని భావించరాదన్నారు. 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నానని, కొన్నిసార్లు నిర్లిప్తతకు, నిరాసక్తికి కూడా గురైన సందర్భాలు ఉన్నాయన్నారు. తోళా చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు కార్తీ సినీ ఫ్యాషన్ చూసిన తరువాత తనలోని ఎనర్జీ పెరిగిందన్నారు. తమిళంలో తన పాత్రకు తననే డబ్బింగ్ చెప్పమని కార్తీ కోరడంతో టెన్సన్ మొదలైందన్నారు.అలాంటిది తన డబ్బింగ్‌ను ఆదరించిన తమిళ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. తన తదుపరి చిత్రం చాలా మంచి చిత్రం అవుతుందని నాగార్జున పేర్కొన్నారు.
 
 అమ్మ ఆనందించారు
 తోళా చిత్రం చూసిన తరువాత మీడియా మిత్రులందరూ చాలా బాగుందని ఆప్యాయంగా కౌగిలించుకుని చెబుతుంటే తన తొలి చిత్రం పరుత్తివీరన్‌కు లభించిన ప్రశంసలు గుర్తుకొచ్చాయని నటుడు కార్తీ పేర్కొన్నారు.తోళా చిత్రం చూసి తన తల్లి చాలా సంతోషించారన్నారు. నాలుగేళ్లుగా తన కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రాలు చూసి ఎంతగానో బాధ పడ్డానని తోళా చిత్రంలో తన అభినయాన్ని చూసి చాలా సంతోషించానని తన తల్లి అన్నట్లు చెప్పారు.

 తన తల్లిదండ్రులు,మిత్రులు చిత్రం చూసి అభినందించడం మరపురాని అనుభూతి అని అన్నారు.ఆర్థిక సమస్యలు,ఇతరత్రా వత్తిళ్లతో జీవితాన్ని చాలా కోల్పోయామని తోళా చిత్రం చూసి తెలుసుకున్నామని చాలా మంది ఫోన్ చేసి చెబుతున్నారని అన్నారు.జీవితపు విలువల్ని చెప్పిన చిత్రం తోళా అని ప్రశంసిస్తున్నారని అన్నారు.విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ తోళా చిత్ర రెండో భాగంలో నటించడానికి తాను రెడీ అనీ అన్నారు.చిన్న షరతుతో నాగ్ సార్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని, అదేమిటంటే ఆయన్ని వీల్ చైర్‌కే పరిమితం చేయకుండా ఊటీ లాంటి ప్రాంతాల్లో డ్యూయెట్లు పాడేలా పాత్ర ఉండాలనీ కార్తీ సరదాగా అన్నారు. తోళా చిత్రాన్ని ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకులకు దర్శకుడు వంశీ పైడిపల్లి థ్యాంక్స్ తెలిపారు.