దొరికితే దొంగ.. దొరక్కపోతే..

3 Apr, 2016 12:54 IST|Sakshi
దొరికితే దొంగ.. దొరక్కపోతే..

 దొరికితే దొంగ.. దొరక్కపోతే పోలీస్.. సారీసారీ దొర.. ఒక గ్రామంలో నిత్యం కోడి పందాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ వ్యవహారాన్ని ‘మామాళ్లు’గానే పట్టించుకోవడం లేదు. అయితే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు (ఎస్‌బీ) విషయం తెలిసి దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మన పోలీసులకు దాడులు చేయక తప్పింది కాదు. ఆ దాడుల్లో 10 మందిని అరెస్టు చేసి సుమారు రూ.3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో అలవాటులో పొరపాటుగా ఏదో అటూఇటూగా రూ.2 లక్షల పైగా సొమ్ము తక్కువ చూపారు. ఈ విషయం డిపార్‌‌టమెంట్‌లో ఆ నోట ఈ నోట.. నాని.. చివరకు ఎస్పీకి చెవికి చేరింది. దీంతో ఆయన సీరియస్ అయ్యి ఎస్‌బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మన పోలీసులు తెగులు సోకిన కోడిలా విలవిల్లాడిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలేంటో చూద్దామా?
 
ఏలూరు (సెంట్రల్) : చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలోని ఒక కోడి పందాల శిబిరంపై ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడిలో స్వాధీనం చేసుకున్న  భారీ మొత్తంలో సొమ్మును పక్కదారి పట్టించినట్టు  ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులను(ఎస్‌బీ) విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దికాలంగా వెంకటాపురంలో రోజూ కోడి పందాలు నిరాటంకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందాలపై అక్కడి పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించకపోవడంతో విషయం ఎస్‌బీ అధికారులకు తెలిసింది. వెంటనే దాడులు నిర్వహించాలని చింతలపూడి పోలీసులను ఆదేశించారు.
 
 ఆ సొమ్ములు కోళ్లు ఎత్తుకుపోయాయా?
 ఈ క్రమంలో ఈ నెల 23న చింతలపూడి పోలీసులు వెంకటాపురం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.66,750, రెండు కార్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు. అయితే ఈ దాడుల్లో 10 మంది దగ్గర నుంచి రూ.మూడు లక్షలు వరకు  స్వాధీనం చేసుకుని రూ. 66,750 మాత్రమే లెక్కల్లో చూపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు లెక్కల్లో తేడాలు ఉన్నాయని అక్కడి నిఘా వర్గాలు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి  తీసుకు వెళ్లడంతో ఆయన  చింతలపూడి పోలీసులు అధికారులపై ఎస్‌బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం.

పోలీసులు నిర్వహించిన  దాడిలో దొరికిన ఓ కాంట్రాక్టరు దగ్గర నుంచే  పోలీసులు రూ.లక్ష వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎస్పీ ఈ విషయంపై సీరియస్‌గా ఉండడంతో సదరు కాంట్రాక్టరుకు తిరిగి డబ్బులు ఇచ్చేందుకు అక్కడే ఓ అధికారి వద్ద పంచాయతీ పెట్టారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై జిల్లా పోలీసు బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

మరిన్ని వార్తలు