ప్రభాస్, కృష్ణంరాజుల 'దందా'

2 Dec, 2015 08:34 IST|Sakshi
ప్రభాస్, కృష్ణంరాజుల 'దందా'

ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానానికి పోటీపడుతున్న స్టార్ హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం 'బాహుబలి 2' పనుల్లో బిజీగా ఉన్నాడు. మరో ఏడాది పాటు ఈ సినిమా మీద దృష్టి పెట్టనున్న ప్రభాస్, ఆ తరువాత ఏ సినిమా చేస్తాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాహుబలితో క్రియేట్ అయిన అంచనాలను మించే సినిమా చేస్తాడా..? లేక ఆ అంచనాలను తగ్గించే సింపుల్ సబ్జెక్ట్తో వస్తాడా..? అన్న చర్చ జరుగుతోంది.

'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించనున్న సినిమాలో ప్రభాస్ నటిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటన ఏమీ లేకపోయినా సుజిత్ మాత్రం మరో సినిమా అంగీకరించకుండా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పెదనాన్న కృష్ణంరాజు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు ప్రభాస్.

ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కృష్ణంరాజు దర్శకత్వంలో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా 'విశాల నేత్రాలు' నవలను సినిమాగా తెరకెక్కించాలని భావించినా తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఛత్రపతి సినిమా తరువాత 'ఒక్కఅడుగు' పేరుతో తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రకటించారు కృష్ణంరాజు. ఈ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా తన సొంతం నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ప్రభాస్ హీరోగా 'దందా' అనే సినిమాను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు కృష్ణంరాజు.

బాహుబలి సినిమా పూర్తవ్వడానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఏ సినిమా అయినా ఆ తరువాతే ప్రారంభించాలి. మరి సుజిత్ అప్పటి వరకు ప్రభాస్ కోసం ఆగుతాడా..? ప్రభాస్ కూడా సుజిత్ సినిమాకు అంగీకరిస్తాడా..? లేక పెదనాన్నతో సినిమాకే సై అంటాడా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందే.