చక్రి లేకపోవడం బాధగా ఉంది : వైవీయస్ చౌదరి

2 Apr, 2015 22:53 IST|Sakshi
చక్రి లేకపోవడం బాధగా ఉంది : వైవీయస్ చౌదరి

‘‘రేయ్ చిత్రం మాస్‌ని బాగా ఆకట్టుకుంటోంది. పరీక్షల సమయం కావడం వల్ల యూత్ తక్కువగా వస్తున్నారు. వాళ్లు కూడా బాగా వస్తే, వసూళ్లు ఇంకా బాగుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తే, గతంలో వైవీయస్ చౌదరి తీసిన ‘దేవదాసు’ స్థాయి విజయం సాధిస్తుంది’’ అని దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. సాయిధరమ్ తేజ్, శ్రద్ధాదాస్‌లతో స్వీయ దర్శకత్వంలో వైవీయస్ రూపొందించిన ‘రేయ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
 
 చక్రి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుక చక్రిగారిదనీ, ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోందనీ సాయిధరమ్ తేజ్ అన్నారు. వైవీయస్ మాట్లాడుతూ, ‘‘చక్రి మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. చిత్రవిజయానికి పాటలెంతో దోహదపడ్డాయి. ‘పవనిజం’ పాటను ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే నుండి జత చేస్తున్నాం. అప్పట్లో ‘దేవదాసు’ స్లోగా పికప్ అయ్యి, మంచి విజయం సాధించింది. ‘రేయ్’ కూడా అంతే’’ అన్నారు. దర్శకుడు సాగర్, రచయిత శ్రీధర్ సీపాన తదితరులు పాల్గొన్నారు.