ప్రస్తుతం సీక్వెల్స్‌ హవా!

27 Nov, 2018 11:58 IST|Sakshi

ఒక సినిమా హిట్‌ అయితే వెంటనే అభిమానులు, ప్రేక్షకులు మళ్లీ అలాంటి చిత్రం కావాలంటారు. సీక్వెల్స్‌ తీయడానికి హీరోలు, దర్శకులు సైతం మొగ్గుచూపుతూ ఉంటారు. ఇలా గతంలో సీక్వెల్‌ తీసిన సినిమాలెన్నో హిట్స్‌గా నిలిచాయి. అయితే అన్ని వేళలా సీక్వెల్స్‌ మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పలేం. ఒక్కోసారి మిశ్రమ ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పలు సీక్వెల్స్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. 

సీక్వెల్ అనగానే ప్రస్తుతం అందరికీ గుర్తుకు వచ్చే సినిమా ‘2.ఓ’. శంకర్‌-రజనీ కాంబినేషన్‌లో 2010లో వచ్చిన రోబో సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు వీరి కాంబినేషన్‌లో ‘2.ఓ’ విడుదలకు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుండగా.. రికార్డులను క్రియేట్‌ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక శంకర్‌ దీని తర్వాత ‘ఇండియన్‌2’ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీకానున్నాడు. కమల్‌హాసన్‌-శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్‌( తెలుగులో భారతీయుడు) అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మూవీ సీక్వెల్‌కు ముహుర్తం కుదిరింది. 

కమల్‌హాసన్‌ సినీకెరీర్‌లో ‘క్షత్రియపుత్రుడు’ది ప్రత్యేకస్థానం. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌ ఈమధ్యే తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా దర్శకుడు సెల్వ రాఘవన్ ‘యుగానికొక్కడు’ సీక్వెల్‌ చేయబోతున్నట్లు ప్రకటించాడు. కార్తీ కెరీర్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌ చేస్తే విజయం సాధిస్తుందని భావిస్తున్నారట. ఇక మాస్‌ ఫాలోయింగ్‌ భారీగా ఉన్న ధనుష్‌ సీక్వెల్స్‌ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ధనుష్‌-కాజల్‌ జంటగా నటించిన ‘మారి’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మారి-2’ని విడుదలచేసేందుకు రెడీ అయ్యారు. రీసెంట్‌గా రిలీజ్‌ అయి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘వడచెన్నై’ చిత్రానికి కూడా సీక్వెల్స్‌ రెడీ అవుతున్నాయి. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించనుండగా.. ఈ చిత్రం రెండో భాగం కూడా రెడీ అవుతోంది. ఇంకా కొన్ని చిత్రాలు సీక్వెల్స్‌కు ప్లాన్‌ చేస్తున్నాయి. మరి వీటన్నంటిలో ఏవి నిలబడి విజయాన్ని సాధిస్తాయో చూడలి. 

మరిన్ని వార్తలు