ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు డబ్బులు వచ్చాయి

3 Jul, 2018 01:30 IST|Sakshi
సురేశ్‌ కొండేటి, శివాజీ రాజా, శంకర్, శ్రీధర్‌

సురేశ్‌ కొండేటి

‘‘పది కోట్ల బడ్జెట్‌తో చేయాల్సిన ‘శంభో శంకర’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే రూపొందించాం. పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకున్నా, సినిమా బాగా రావాలని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు వారు పెట్టిన డబ్బులు వచ్చాయి’’ అని నిర్మాత సురేశ్‌ కొండేటి అన్నారు. ‘షకలక’ శంకర్, కారుణ్య జంటగా ఎస్‌.కె. పిక్చర్స్‌ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేశ్‌ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.

సురేశ్‌ కొండేటి మాట్లాడుతూ – ‘‘మా సినిమా పక్కా కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని కచ్చితంగా చెప్పగలను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి శివాజీరాజాగారితో కలిసి తిరిగాను. ఆయన మంచితనాన్ని, సేవలను స్ఫూర్తిగా తీసుకుని నా వంతు సహకారాన్ని అందించాలనుకుంటున్నా. ‘శంభో శంకర’ ద్వారా వచ్చిన కొంత అమౌంట్‌లో పది వేలు చొప్పున పది మంది నిరుపేదలకు అందించాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం శంకర్, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం.

ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ సినిమా హిట్‌తో ఆ భయం పోయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు డైరెక్టర్‌ శ్రీధర్‌. ‘‘మా సినిమా హిట్‌ అవడంతో మాకంటే ఎక్కువగా ప్రేక్షకులు హ్యాపీగా ఉన్నారు. థియేటర్లో ఉన్నప్పుడే నాకు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. మా కష్టం ఫలించింది. ఇకపై కూడా ఇదే విధంగా నిజాయితీగా, నమ్మకంగా సినిమాలు చేస్తా’’ అన్నారు ‘షకలక’ శంకర్‌. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా, కథానాయిక కారుణ్య, నటులు ఏడిద శ్రీరామ్, ప్రభు, నాగినీడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు