సినిమాను యజ్ఞంలా భావించే దర్శకుల్లో శంకర్ ముందు వరుసలో ఉంటారు. ఆర్టిస్టుల నుంచి సాంకేతిక నిపుణుల వరకూ ఆయన సినిమా అంటే ఓ పరీక్షే. ప్రస్తుతం విక్రమ్ కథానాయకునిగా ‘ఐ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్. తెలుగులో ఈ చిత్రం ‘మనోహరుడు’ పేరుతో విడుదల కానుంది. ‘అపరిచితుడు’లో విక్రమ్ చేత మూడు రకాల షేడ్స్లో పాత్ర చేయించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు శంకర్. ఇప్పుడు ‘మనోహరుడు’లో విక్రమ్ చేసే పాత్ర తన కెరీర్లోనే భిన్నమైందని తెలుస్తోంది.
ఆ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారని సమాచారం. చైనా వెళ్లి అక్కడి శిక్షకుల నేతృత్వంలో కఠినమైన వ్యాయామాలు చేసి 30 కేజీలు వెయిట్ లాస్ అయ్యారట విక్రమ్. స్లిమ్ అయిన విక్రమ్ లొకేషన్లోకి రాగానే అవాక్కవ్వడం అక్కడున్నవారి వంతైందని వినికిడి. ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తయింది. అవుట్పుట్ విషయంలో శంకర్ ఎంతో సంతృప్తిగా ఉన్నారని సమాచారం.
శంకర్ సినిమా అనగానే గుర్తొచ్చేది విజువల్ ఎఫెక్ట్స్. తన గత చిత్రాలను మించే రేంజ్లో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని వినికిడి. న్యూజిలాండ్లోని వెటా స్టూడియో వారు ఈ సినిమాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ని తీర్చి దిద్దుతున్నారు. వందకోట్ల భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రం ‘ఐ’ ఫీస్ట్గా ఉండబోతోందని యూనిట్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ‘జెంటిల్మెన్’ నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న శంకర్ స్పీడ్కి ‘స్నేహితుడు’ చిత్రం బ్రేక్ వేసింది. అందుకే కసితో మనోహరంగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.సి.శ్రీరామ్, సంగీతం: ఏఆర్ రెహమాన్.