కేసులకు భయపడను: హీరో మాజీ భార్య

20 Jun, 2016 10:37 IST|Sakshi
కేసులకు భయపడను: హీరో మాజీ భార్య

ముంబై: తన గౌరవాన్ని చెడగొట్టేందుకే ఛీటింగ్ కేసు పెట్టారని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ఆరోపించారు. తనను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే కేసు పెట్టారని అన్నారు. ఇలాంటి కేసులకు బెదిరేది లేదని చెప్పారు. లండన్ లో ఉన్న సుసానే ఖాన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు రద్దు చేసినందుకు తనకే డబ్బులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు రావాల్సిన డబ్బుల గురించి అడిగినందుకే తనపై కేసు పెట్టారని సుసానే ఖాన్ ఆరోపించారు. ఒత్తిడికి గురి చేసి రాజీ రావాలన్న కుట్రతోనే ఇదంతా చేశారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

'ఇలాంటి కేసులు నన్ను భయపెట్టలేవు. రెట్టించిన ఉత్సాహంతో సత్యం కోసం పోరాడతా. ఫిర్యాదులో నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం. నన్ను అవమానించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాన'ని సుసానే ఖాన్ హెచ్చరించారు. రూ. 1.87 కోట్లకు సుసానే ఖాన్ తమను మోసం చేసిందని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గోవాలో ఛీటింగ్ కేసు పెట్టింది.