సినిమా ఇండస్ట్రీలో మార్పు రావాలి: తాప్సీ

24 Jul, 2019 20:02 IST|Sakshi

ముంబై : తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బీజీగా ఉ‍న్నారు. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే తాప్సీపై ఇటీవల నెటిజన్‌ తనపై చేసిన కామెంట్‌పై ఘాటుగా స్పందించి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఢిల్లీ భామ తాజాగా మరో విషయంపై స్పందించారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఓవర్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన తాప్సీ వెండితెరపై ‘హీరో’ అన్న పదానికి కేవలం పురుష నటుడిగా మాత్రమే సమాజం భావిస్తోందని, నిజానికి  హీరో అన్న పదానికి లింగ భేదం ఉండదని పేర్కొన్నారు. ఈ ధోరణిలో మార్పు తీసురావడమే తన లక్ష్యమని, నెమ్మదిగా ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. 

మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను అటు ఇండస్ట్రీతోపాటు ఇటు అభిమానులు అంగీకరించినప్పుడే ఈ మార్పు సాధ్యమవుతుందని, ప్రస్తుతం మార్పు రావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. మహిళలకు, పురుషులకు మధ్య ఉన్న వ్యత్యాసం తొలగినప్పుడే  అందరి సినిమాలు  సరిగా ఆదరించబడతాయని తెలిపారు. ఈ మార్పు ఏక కాలంలో వచ్చేది కాదని..ఇందుకోసం నటీమణులు కృషి చేయాలని ఆమె కోరారు.

ఇక ఈ ఏడాది తాప్సీ బద్లా, గేమ్‌ ఓవర్‌   రెండు చిత్రాలు విడుదలకాగా బద్లా సినిమా రూ. 100 కోట్ల మేర వసూళ్లు సాధించగా, గేమ్‌ ఓవర్‌ విమర్శకుల ప్రశంసలు పొందినా వసూళ్లలో వెనుకబడిన సంగతి తెలిసిందే. తాప్పీ నటించిన తాజా సినిమాలు మిషన్‌ మంగళ్‌, సాంద్‌ కి ఆంఖ్‌‌..  రెండు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

మరిన్ని వార్తలు