సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

24 Jul, 2019 20:03 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని యావత్‌ భారతావని దృష్టిని ఆకర్షించిన అథ్లెట్‌ హిమ దాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సద్గురు ట్వీట్‌ చేశారు. ‘హిమదాస్‌కు శుభాకాంక్షలు, అదేవిధంగా బ్లెస్సింగ్స్‌’అంటూ పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ట్వీట్‌లో ‘Golden Shower For India’అని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అసభ్యపద జాలం అంటూ సద్గురుకు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

అయితే దీనిపై సద్గురు ఫాలోవర్స్‌ కూడా వెంటనే రియాక్ట్‌ అయ్యారు. హిమదాస్‌ బంగారు వర్షం కురిపిస్తోందనే ఉద్దేశంతో అలా అన్నారని కానీ దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. అయితే దీనిపై రెండు వర్గాల వారు ట్విటర్‌ వేదికగా వాగ్వాదం చేసుకుంటున్నారు. మామూలుగా సద్గురు వాడిన పదంలో ఎలాంటి అభ్యతరకరం లేదని.. కానీ పాశ్చాత్య దేశాల్లో దాని అర్థాన్ని మార్చారని సద్గురు అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే గతంలో అమెరికన్‌ రచయిత జేమ్స్‌ కోమే ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో ఈ పదజాలం వాడి విమర్శలపాలైన విషయాన్ని సద్గురు వ్యతిరేకులు గుర్తుచేస్తున్నారు.      
 

మరిన్ని వార్తలు