విశాల్ సరసన తమన్న

25 Jun, 2015 09:11 IST|Sakshi
విశాల్ సరసన తమన్న

చెన్నై : ప్రముఖ కథానాయికలిప్పుడు కోలీవుడ్‌నే గురిగా పెట్టుకున్నారా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకు ముందు తెలుగులో ప్రముఖ కథానాయికలుగా వెలుగొందిన శ్రుతిహాసన్, సమంత, కాజల్ అగర్వాల్ లాంటి వారందరూ ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమపై దాడి చేస్తున్నారు. నేనేమీ తక్కువా అన్నట్లు తమన్న కూడా కోలీవుడ్‌నే గురిచేస్తున్నారు. తెలుగులో యువ హీరోల నుంచి టాప్ హీరోలందరితోనూ నటించిన ఈ మిల్కీబ్యూటీకి ఇప్పుడు అక్కడ అవకాశాలు తక్కువేనని చెప్పక తప్పదు.
 
 తెలుగు,తమిళ భాషల్లో అనుష్కతో కలిసి తమన్న నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. అంతకు మంచి అక్కడ సినిమాలు లేవు. ప్రస్తుతం తమిళంలో ఆర్యకు జంటగా వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

తదుపరి ఏమిటని అనుకుంటున్న తరుణంలో తమన్నకు ఒక భారీ అవకాశం వచ్చింది. సండైకోళి-2 లో విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశం తలుపు తట్టింది. నిజానికి అవకాశం సమంతకు దక్కాల్సింది. ఆనందం,రన్, సండైకోళి, పైయ్యా,వట్టై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన లింగసామి సూర్యతో చేసిన అంజాన్ నిరాశ పరచడంతో చిన్న గ్యాప్ తీసుకుని సండైకోళి-2 చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 
సండైకోళి ఫేమ్ విశాల్‌నే ఈ చిత్రంలోనూ హీరోగా నటించనున్నారు. ఆయనకు జంటగా నటి సమంతను నటింపజేయాలని లింగసామి భావించారు. అయితే అంజాన్ చిత్రంలో అవసరం అయిన దానికంటే ఎక్కువే తనను కష్టపెట్టారంటే సండైకోళి-2లో నటించడానికి ఆ చెన్నై చిన్నది నో చెప్పిందట. దీంతో తన దర్శకత్వంలో ఇంతకు ముందు పైయ్యా చిత్రంలో నటించిన తమన్నను సంప్రదించగా ఆమె వెంటనే ఓకే అనడంతో సండైకోళి-2 త్వరలో సెట్‌పైకి వెళ్లనుందన్నది తాజా సమాచారం.