ఖుషీగా తమన్న

22 Nov, 2014 02:44 IST|Sakshi
ఖుషీగా తమన్న

నటి తమన్న ఖుషీఖుషీగా ఉన్నారు. కారణమేమిటంటారా? ఈబ్యూటీ సుమారు 11 నెలల తరువాత కోలీవుడ్ చిత్రంలో నటించడానికి చెన్నైకి చేరుకున్నారు. ఇంతకుముందు తమన్న అజిత్ సరసన నటించిన వీరం చిత్రం గత సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ తరువాత ఆమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు. మరో విషయం ఏమిటంటే వీరం చిత్రానికి ముందు మూడేళ్లు తమిళ చిత్రానికి దూరంగా ఉన్నారు.

అందుకు కారణం ఆమెకు ఒక స్టార్ కుటుంబంలో ఏర్పడ్డ సమస్యలేనని ప్రచారం జరిగింది. అందువలనే ఆమెకు తమిళంలో అవకాశాలివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదనే ప్రచారం సాగింది. అలాంటి సమయంలోనే నటుడు అజిత్ ధైర్యం చేసి వీరం చిత్రంలో అవకాశం కల్పించారనే టాక్ వినిపించింది. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం తమన్నకు తెలుగులోనూ పెద్దగా అవకాశాలు లేవు. బాలీవుడ్ అయితే ఈ ముద్దుగుమ్మను పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో తమిళ చిత్రాలపై దృష్టి సారించారు. తాజాగా ఆర్య సరసన నటించడానికి చెన్నైకి వచ్చారు.

రాజేష్ ఎం.దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ తమిళ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఆర్యతో కలిసి తొలిరోజే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనడం మరింత సంతోషంగా ఉందని తమన్న తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది రొమాంటిక్ లవ్, ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.