మోత మోగాల్సిందే

30 Sep, 2019 00:27 IST|Sakshi

స్పెషల్‌ సాంగ్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఫుల్‌ ఎనర్జీతో ఉంటాయి. ఈ స్టెప్స్‌కు స్క్రీన్‌పై మహేశ్‌ బాబు కూడా ఉంటే ఇక అంతే...థియేటర్‌లో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఈల వేసి గోల చేయాల్సిందే. ఆ సౌండ్‌కి థియేటర్‌ మోత మోగాల్సిందే. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇంట్రోసాంగ్‌లో తమన్నా డ్యాన్స్‌తో అలరించబోతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ–‘‘మహేశ్‌తో ‘ఆగడు’(2014) సినిమాలో హీరోయిన్‌గా నటించాను. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మహేశ్‌ సినిమా ఇంట్రో సాంగ్‌లో డ్యాన్స్‌ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ పాట గురించి చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు. ఇంట్రో సాంగ్‌ చిత్రీకరణను డిసెంబరులో ప్లాన్‌ చేశారని తెలిసింది. అలాగే మహేశ్‌ ఇంట్రోసాంగ్‌లో తమన్నా కనిపిస్తే, స్పెషల్‌ సాంగ్‌లో పూజా హెగ్డే చిందేస్తారట. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాలో  రష్మికా మండన్నా కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

మరిన్ని వార్తలు