అందుకే పోటీ చేశా!

28 Dec, 2017 19:56 IST|Sakshi

సాక్షి, సినిమా: అన్నం పెట్టిన పరిశ్రమకు ఏదైనా మంచి చేయాలనే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని ఆ సంఘ అధ్యక్షుడు, నటుడు, నిర్మాత విశాల్‌ పేర్కొన్నారు. ఆయన తాజాగా కథానాయకుడిగా నటించి, విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇరుంబుతిరై. ఇందులో నటి సమంత హీరోయిన్‌గా, సీనియర్‌ నటుడు అర్జున్‌ ప్రతినాయకుడిగా నటించారు. పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. 

విశాల్‌ మాట్లడుతూ.. ఇరుంబుతిరై చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావలసి ఉందన్నారు. తాను నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో చిత్ర విడుదలకు జాప్యం జరిగిందన్నారు. తానూ వడ్డీకి డబ్బులు తీసుకునే చిత్రాలను నిర్మిస్తున్నానని, వడ్డీలు పెరుగుతాయని స్వార్థం చూసుకుని ఈ చిత్రాన్ని నిర్ణయించిన తేదీలో విడుదల చేసుకోవచ్చునని అన్నారు. అయితే తనకు అన్నం పెట్టిన చిత్ర పరిశ్రమకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్మాతలమండలి ఎన్నికల్లో తన బృందంతో పోటీ చేశానని అన్నారు. ఆ విధంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చుతున్నామని, పలు వివాధాలు ఎదురవుతున్నా వాటిని ఎదుర్కొని సాధించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందుకు అందరూ సహకరించాలని, సంఘం ద్వారా నిర్మాతలందరికీ మంచి జరిగే సమయం ఆసన్నమైందని అన్నారు. 

>
మరిన్ని వార్తలు