ధనుష్‌ చిత్రాలను రజనీ ఎందుకు నిరాకరించారు?

21 Jun, 2020 08:14 IST|Sakshi

నటుడు ధనుష్‌ చిత్రాలను రజినీకాంత్‌ ఎందుకు నిరాకరించారు అన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నటుడు ధనుష్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విషయం తెలిసిందే. ఈయన కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్‌లోను నటుడిగా పేరును సంపాదించుకున్నారు. కాగా ధనుష్‌లో నటుడితో పాటు కథకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత ఉన్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ధనుష్‌ ఇంతకుముందు మెగాఫోన్‌ పట్టి పవర్‌ పాండి అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రం విజయంతో ధనుష్‌ మరో భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ తెనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ నటుడు నాగార్జున, శరత్‌కుమార్, నటి అధితి, ఎస్‌ ఏ. సూర్య వంటి పలువురు ప్రముఖ నటీనటులను ఏంపిక చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి నాన్‌ రుద్రన్‌ అనే పేరును కూడా నిర్ణయించారు.

కాగా ఆ చిత్రంలో ముందుగా రజనీకాంత్‌ కథానాయకుడిగా చేయాలని ధనుష్‌ భావించినట్లు సమాచారం అందులో భాగంగానే ఆయన రజనీకాంత్‌ కథకు కూడా కథ వినిపించారు. కథ విన్న రజినీకాంత్‌ చాలా బాగుంది అంటూనే ఇందులో ఫైట్స్‌ ఎక్కువగా ఉండడంతో తనకు బదులు యువ నటుడు నటిస్తే బాగుంటుంది అని చెప్పి అందులో తను నటించడానికి నిరాకరించినట్లు సమాచారం. ఇక ఈ విషయం పక్కన పెడితే కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీ తెనాండాళ్‌ ఫిలిమ్స్‌ సంస్థ చిత్ర నిర్మాణాన్ని అప్పట్లో చేపట్ట లేకపోయింది. అయితే నటుడు ధనుష్‌ ఆ చిత్రాన్ని తాజాగా చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ భారీ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ చిత్రంలో ముందుగా నటించడానికి అంగీకరించినట్లు చెప్పిన నాగార్జున ఇప్పుడు మళ్లీ నటిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది కాలం ఆగాల్సిందే.  

చదవండి: మా నాన్న మాకు మంచి ఫ్రెండ్‌

మరిన్ని వార్తలు