ఆ 11 మంది బాలికలు హత్యకు గురయ్యారు..!

4 May, 2019 11:53 IST|Sakshi
ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసు ప్రధాన నిందితుడు బ్రజేష్‌ ఠాకూర్‌ (ఫైల్‌ఫోటో)

షెల్టర్‌ హోమ్‌ ఘటనపై సీబీఐ అఫిడవిట్‌

న్యూఢిల్లీ: ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోమ్‌ ఘటనలో జాడ తెలియని 11 మంది బాలికలు హత్యకు గురై ఉండొచ్చునని సీజీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడున బ్రజేష్‌ ఠాకూర్‌, అతని అనుచరులు వారిని దారుణంగా హత్య చేసి పాతిపెట్టారని శుక్రవారం  కోర్టుకు నివేదించింది. షెల్టర్‌ హోమ్‌ సమీపంలో గల శ్మశానం నుంచి బాలికల ఎముకల అవశేషాలను సేకరించామని పేర్కొంది. హత్యకు గురైన చిన్నారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ తన అఫిడవిట్‌లో వివరించింది. ఇక గతేడాది మే నెలలో బయటపడిన ముజరాఫర్‌ షెల్టర్‌ హోమ్‌ ఘటనలో 40 మంది బాలికలు అత్యాచారాలకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నివేదిక బయటపెట్టిన సంగతి తెలిసిందే.

వసతి గృహంలో తలదాచుకుంటున్న అనాథ బాలికల పట్ల అఘాయిత్యాలు వెలుగు చూడడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెల్టర్‌ హోంల నిర్వహణ పట్ల బిహార్‌ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని గత ఫిబ్రబరిలో ఆదేశించింది. షెల్టర్‌ హోం కేసులన్నింటినీ బిహార్‌ సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో సాకేత్‌ ట్రయల్‌ కోర్టుకు రెండు వారాల్లోగా తరలించాలని స్పష్టం చేసింది. ​​​​బ్రజేష్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఠాకూర్‌తో పాటు మరో 21 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసి విచారణ చేస్తోంది. కామాంధుల కీచకపర్వంలో సమిధలైన చిన్నారులంతా 7-14 ఏళ్లలోపు వారే కావడం దారుణం.

(చదవండి : షెల్టర్‌ హోం కేసు: ఢిల్లీ కోర్టుకు బదలాయించిన సుప్రీం)

మరిన్ని వార్తలు