‘ఆస్పత్రిలో ఉన్నప్పుడే చంపాలని డిసైడ్‌ అయ్యా..’

18 May, 2017 09:09 IST|Sakshi
‘ఆస్పత్రిలో ఉన్నప్పుడే చంపాలని డిసైడ్‌ అయ్యా..’

న్యూఢిల్లీ: ఢిల్లీలో మైనర్‌ దారుణానికి ఒడిగట్టాడు. ఏడాది కిందట తన సోదరిని ఏడిపించి తనపై కత్తితో దాడికి పాల్పడిన వారిపై ప్రతీకార దాడులు చేసి ఒకే రాత్రి రెండు హత్యలు చేశాడు. ఇందులో ఒక హత్యలో తన మిత్రుడు పాల్గొనగా మరో హత్యను ఒంటరిగా చేశాడు. అయితే, గంటల్లోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నాడు. గత ఏడాది సునీల్‌, కులదీప్‌ అనే ఇద్దరు యువకులు ప్రస్తుతం హత్యకు పాల్పడిన మైనర్‌తో తరుచూ గొడవపడుతుండేవారు. పైగా ఒకసారి వారి సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అతడిని కత్తితో పొడిచారు.

అనంతరం వారిలో సునీల్‌ అనే వ్యక్తిని జైలులో వేయగా అతడు ఇటీవలె పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఇదే అదనుగా చూసుకున్న మైనర్‌ తన స్నేహితుడు మనోజ్‌ను పిలిపించుకొని ఖ్యాలా ప్రాంతానికి సునీల్‌కోసం వెళ్లారు. అతడితో ఏదో మాట్లాడాలని ఓ పార్క్‌కు పిలిచి ఓ ఐదు నిమిషాల తర్వాత నాలుగుసార్లు కత్తితో పొడిచి రక్తపు మడుగులో పడేసి వెళ్లిపోయారు. పోతూ పోతూ ఓ వ్యక్తి దగ్గర నుంచి బంగారం చైన్‌ లాక్కొని వెళ్లే క్రమంలో మనోజ్‌ తల్లి దండ్రులు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు.

దాంతో మనోజ్‌ వెళ్లిపోగా మైనర్‌ మాత్రం మరో హత్య చేసేందుకు కులదీప్‌ వద్దకు వెళ్లాడు. రాత్రి 11గంటల ప్రాంతంలో అతడిని బయటకు పిలిచి ఏకంగా 20సార్లు అదే కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోగా తొలుత మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి సహాయంతో మైనర్‌ను అరెస్టు చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇక ఎలాంటి గొడవలు ఉండొద్దనే తాను ఈ హత్యలు చేశానని నేరాన్ని అంగీకరించాడు.

మరిన్ని వార్తలు