పశ్చిమ బెంగాల్‌లో మృత్యుఘోష

19 Oct, 2013 16:09 IST|Sakshi

మూడు రోజుల్లో 20 మంది పసికందుల మృతి

కోల్కతా: పశ్చిమ బెంగాల్‌లో చిన్నారుల మృత్యుఘోష వినిపిస్తోంది. మాల్దా ఆస్పత్రిలో గత 72 గంటల్లో 20 మంది పసిపాపలు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని బాధితులు తెలిపారు. ఈ ఆస్పత్రిలో చిన్నారులు చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో 16 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన నిపుణుల బృందం పౌష్టికాహార లోపం, తక్కువ బరువుతో పుట్టడం వల్లే పసిబిడ్డలు చనిపోయారని వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రులలో చిన్నారులు చనిపోతున్నారు. కోల్‌కతాలోని బీసీ రాయ్ ఆస్పత్రిలో గత నెలలో దాదాపు 65 మంది పసిపాపలు ప్రాణాలు కోల్పోయారు. మాల్దా ఆస్పత్రిలో జరిగిన తాజా ఘటనతో వైద్యుల వైఖరిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మాల్దా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని బాధితులు మండిపడుతున్నారు. కొందరు డాక్టర్లు సరిగా విధులు నిర్వహించడం లేదని, ఆస్పత్రిలో వైద్య పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు