ముంబై : ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపథ్యంలో.. బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సాధరణ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో పూణె నియోజక వర్గం నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ను బరిలోకి దించుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల కోసం ఎవరెవరిని బరిలోకి దించాలనే అంశంపై బీజేపీ ఇప్పటికే జాబితాను పూర్తి చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ జాబితాలో మాధురికి, పూణె నుంచి టికెట్ కన్ఫామ్ చేసినట్లు తెలిపారు.
ఈ ఏడాది జూన్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా ముంబయిలోని మాధురి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ‘సంపర్క్ సమర్థాన్’(భాజపాకు మద్దతివ్వండి) కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఆమెతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి, సాధించిన అభివృద్ధి గురించి అమిత్ షా మాధురికి వివరించారు. ఈ విషయం గురించి సీనియర్ నాయుకుడు ఒకరు.. ‘మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యూహాలనే పాటించారు. ఆ సమయంలో పాత అభ్యర్థుల స్థానంలో కొత్త వారిని నిలబెట్టి భారీ మెజారిటీ సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన అనిల్ శిరోల్ మీద దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.